ఆస్తుల విక్రయం.. ఒక మైలురాయి!
మాల్టా కేంద్రంగా పనిచేస్తున్న ఛాలెంజ్ గ్రూప్ కు చెందిన Ace Aviation సంస్థ, జెట్ ఎయిర్వేస్ నుండి రెండు బోయింగ్ 777-300ER విమానాలను కొనుగోలు చేసింది. ఢిల్లీ విమానాశ్రయంలో ఏప్రిల్ 2019 నుంచి నిరుపయోగంగా పడి ఉన్న ఈ విమానాలను BAANKNET ప్లాట్ఫామ్ లో ఈ-వేలం ద్వారా సొంతం చేసుకున్నారు. ఈ డీల్ విలువ సుమారు ₹568.18 కోట్ల వరకు ఉంది. గతంలోనూ ఇదే సంస్థ మూడు బోయింగ్ 777 విమానాలను $46 మిలియన్లకు కొనుగోలు చేసింది. ఇప్పుడు కొనుగోలు చేసిన ఈ విమానాలను కార్గో విమానాలుగా మార్చి, ఛాలెంజ్ గ్రూప్ ప్రపంచవ్యాప్త లాజిస్టిక్స్ నెట్వర్క్ను విస్తరించాలని చూస్తోంది.
న్యాయపరమైన అడ్డంకులు..
ఈ అమ్మకం అంత సులభంగా జరగలేదు. ఏళ్ల తరబడి సాగుతున్న జెట్ ఎయిర్వేస్ దివాలా ప్రక్రియ నేపథ్యంలో ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి. Ace Aviation కు అనుకూలంగా, ఇతర బిడ్డర్లకు అన్యాయం జరుగుతుందని, సమాచారం లీక్ అయిందని ఒక పోటీదారు (Industrial Asset Transaction Services Private Limited) ఆరోపించింది. అయితే, ఈ ఆరోపణలను ముంబైలోని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) కొట్టిపారేసింది. ఈ నిర్ణయాన్ని నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్, సుప్రీంకోర్టు కూడా సమర్థించడంతో, ఆస్తుల అమ్మకానికి మార్గం సుగమమైంది.
దివాలా ప్రక్రియ.. ఒక గుణపాఠం
జెట్ ఎయిర్వేస్ దివాలా ప్రక్రియ, సంక్లిష్టమైన విధానాలు, ఆస్తుల విలువ తగ్గడం వంటి అంశాలపై ఒక గుణపాఠంగా మిగిలిపోయింది. ఈ విమానాల అమ్మకం పూర్తయినప్పటికీ, కంపెనీని పునరుద్ధరించే ప్రయత్నాలు విఫలమవ్వడంతో నవంబర్ 2024లో లిక్విడేషన్ కు ఆదేశాలు జారీ అయ్యాయి. విమానాశ్రయాల్లో పార్కింగ్, నిర్వహణ బకాయిలు భారీగా పేరుకుపోవడం లిక్విడేషన్ ఆస్తులపై భారాన్ని పెంచింది. ఐదేళ్లకు పైగా సాగిన ఈ ప్రక్రియ కారణంగా, ఉద్యోగులు, టికెట్ రిఫండ్ క్లెయిమెంట్స్ వంటి రుణదాతలకు రావాల్సిన మొత్తాలు గణనీయంగా తగ్గాయి.
భవిష్యత్ ప్రణాళిక
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, దివాలా చట్టం (Insolvency and Bankruptcy Code) ప్రకారం మిగిలిన ఆస్తులను వేలం వేస్తూ, రుణదాతలకు చెల్లింపులు ప్రారంభించే ప్రక్రియపై దృష్టి సారించారు. జెట్ ఎయిర్వేస్ వంటి దిగ్గజ సంస్థ కుప్పకూలిన తీరు, దాని ఆస్తుల పరిష్కారం భారత కార్పొరేట్ చరిత్రలో ఒక సంక్లిష్టమైన కేసుగా మిగిలిపోయింది.
