ఆపరేషన్స్ పైలం.. DGCA ధృవీకరణ!
భారతదేశంలోనే అతిపెద్ద ఎయిర్లైన్ అయిన ఇండిగో (IndiGo), తమ పైలట్ల డ్యూటీ సమయాలకు సంబంధించిన తాత్కాలిక వెసులుబాట్లు ముగిసిన నేపథ్యంలో, తమ కార్యకలాపాలు ఇక స్థిరంగా కొనసాగుతాయని ప్రకటించింది. సంస్థ తెలిపిన దాని ప్రకారం, తమ నెట్వర్క్ అంతటా ఎలాంటి ఆటంకాలు లేకుండా సేవలు అందించడానికి, కొత్తగా సవరించిన ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్ (FTDL) నిబంధనలకు అనుగుణంగా పనిచేయడానికి అవసరమైన సిబ్బంది, ముఖ్యంగా పైలట్లు పుష్కలంగా ఉన్నారని పేర్కొంది. గత డిసెంబర్లో వేలాది విమానాలు రద్దు కావడంతో పాటు, ఆలస్యాలు జరిగిన నేపథ్యంలో ఈ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.
జనవరి 20 న డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది. నిరంతర పర్యవేక్షణ, సరిదిద్దిన చర్యల ద్వారా ఇండిగో కార్యకలాపాలు ఇప్పుడు స్థిరపడ్డాయని, కొత్త FDTL నిబంధనలను మరింత అంతరాయం లేకుండా పాటించడానికి సరిపడా పైలట్లు ఉన్నారని DGCA తెలిపింది. సంస్థ అందించిన లెక్కల ప్రకారం, ఇండిగో వద్ద అవసరమైన 2,280 మంది కమాండర్ పైలట్లకు (PICs) గాను 2,400 మంది, అవసరమైన 2,050 మంది ఫస్ట్ ఆఫీసర్లకు గాను 2,240 మంది ఉన్నారని DGCA నివేదిక వెల్లడించింది.
గతంలో గందరగోళం - కారణాలివే!
గత డిసెంబర్ తొలివారంలో, ఇండిగో భారీ అంతరాయాలను ఎదుర్కొంది. డిసెంబర్ 3 నుంచి 5 మధ్య కాలంలో ఏకంగా 2,507 విమానాలను రద్దు చేసింది. దీని వల్ల 3 లక్షల మందికి పైగా ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఈ పరిణామంతో DGCA, సంస్థ యొక్క వింటర్ షెడ్యూల్ను 10 శాతం తగ్గించి, ₹22.20 కోట్ల భారీ జరిమానా కూడా విధించింది. DGCA విచారణలో, కార్యకలాపాలను అధికంగా ఆప్టిమైజ్ చేసుకోవడం, నియంత్రణలకు సరైన సన్నద్ధత లేకపోవడం, యాజమాన్యం లోపాలు, కార్యకలాపాల నియంత్రణలో లోటుపాట్లు ఈ సంక్షోభానికి ప్రధాన కారణాలుగా తేలాయి.
నియంత్రణ సంస్థల సడలింపులు, పైలట్ల ఆందోళనలు
సివిల్ ఏవియేషన్ రాష్ట్ర మంత్రి మురళీధర్ మోహల్ తెలిపిన వివరాల ప్రకారం, కార్యకలాపాలను స్థిరీకరించడంలో సహాయపడేందుకు, రాత్రి విధులు, ల్యాండింగ్లకు సంబంధించిన కొన్ని FDTL నిబంధనల నుంచి ఇండిగోకు ఫిబ్రవరి 10 వరకు తాత్కాలిక మినహాయింపు లభించింది. అయితే, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పైలట్స్ (FIP) మాత్రం, పైలట్ అలసటను తగ్గించడానికి, విమాన భద్రతను నిర్ధారించడానికి, ఎటువంటి మినహాయింపులు లేకుండా సవరించిన FDTL నిబంధనలను కచ్చితంగా అమలు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది. విమాన భద్రత విషయంలో రాజీ పడకూడదని, అన్ని ఆపరేటర్లు నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని FIP అధ్యక్షుడు సి.ఎస్. రణధావా కోరారు.
కొత్త నిబంధనలను పాటిస్తున్నాం!
ఈ నేపథ్యంలో, ఇండిగో ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ, సంస్థ ఇప్పటికే కొత్త నిబంధనల సెట్ను తమ సిబ్బంది రోస్టర్లు, ప్రణాళికల్లో పొందుపరిచిందని, FDTL నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ, కార్యకలాపాలు స్థిరంగా కొనసాగుతాయని భరోసా ఇచ్చారు.