'డీమ్డ్ లైసెన్స్' అంటే ఏంటి?
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త పాలసీ, Google వంటి పెద్ద విద్యుత్ వినియోగదారులకు 'డీమ్డ్ లైసెన్స్' హోదాను ఇస్తుంది. అంటే, వీరు రాష్ట్ర పంపిణీ వ్యవస్థపై ఆధారపడకుండా, సొంతంగా పవర్ నెట్వర్క్లను నిర్మించుకోవచ్చు. పునరుత్పాదక ఇంధన వనరుల (Renewable Energy)తో సహా వివిధ మార్గాల ద్వారా నేరుగా విద్యుత్ను కొనుగోలు చేసుకోవచ్చు.
ఈ 'డీమ్డ్ లైసెన్స్' పాలసీ, 'పవర్ సెక్టార్ రిఫార్మ్స్ 3.0'లో భాగంగా తీసుకొచ్చారు. దీనితో Google తన విశాఖపట్నం డేటా సెంటర్ కోసం అవసరమైన విద్యుత్ను ఓపెన్ యాక్సెస్, సొంత ఉత్పత్తి వంటి మార్గాల ద్వారా నేరుగా పొందగలదు. ఇది Googleకు తమ విద్యుత్ ఖర్చులపై, సరఫరాపై ఎక్కువ నియంత్రణ ఇస్తుంది.
DISCOMలపై తీవ్ర ప్రభావం!
అయితే, ఈ నిర్ణయం రాష్ట్ర డిస్కంలకు (DISCOMs) ఆర్థికంగా పెద్ద సవాలుగా మారుతోంది. ఇలాంటి పెద్ద వినియోగదారులు నేరుగా విద్యుత్ కొనుగోలు చేస్తే, డిస్కంలు భారీ ఆదాయాన్ని కోల్పోతాయి. దేశంలో విద్యుత్ రంగంలో, పెద్ద పారిశ్రామిక వినియోగదారుల నుంచి వచ్చే ఆదాయంతోనే గృహ, వ్యవసాయ వినియోగదారులకు తక్కువ ధరలకు విద్యుత్ అందిస్తారు. ఇలాంటి కీలక కస్టమర్లను కోల్పోతే, ఆ భారం మిగిలిన వారిపై పడుతుంది.
ఇతర రాష్ట్రాలైన తెలంగాణ, మహారాష్ట్ర కూడా డేటా సెంటర్ల పెట్టుబడులను ఆకర్షిస్తున్నప్పటికీ, అక్కడ నేరుగా పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు (PPAలు) లేదా ప్రత్యేక పారిశ్రామిక టారిఫ్లు అమలు చేస్తున్నారు. కానీ, ఆంధ్రప్రదేశ్ 'డీమ్డ్ లైసెన్స్' ఇవ్వడం ద్వారా పూర్తి స్థాయి పంపిణీ హక్కులను మంజూరు చేస్తోంది.
సంక్షోభంలో విద్యుత్ రంగం?
డేటా సెంటర్ల కోసం దేశంలో విద్యుత్ డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో, పెద్ద వినియోగదారులు సొంతంగా విద్యుత్ తీసుకోవడం వల్ల, గృహ, వ్యవసాయ వినియోగదారులకు విద్యుత్ బిల్లులు పెరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా, డిస్కంల ఆర్థిక పరిస్థితి మరింత దిగజమొచ్చు. వీరి ఆదాయం తగ్గితే, మౌలిక సదుపాయాల కల్పన, నిర్వహణ కష్టమవుతుంది.
ఈ పాలసీ ప్రకారం, డేటా సెంటర్లు 51% పునరుత్పాదక ఇంధనాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ వనరులు అందుబాటులో లేకపోతే, డిస్కంల నుంచి బ్యాకప్ పవర్ తీసుకోవాల్సి వస్తుంది. అప్పుడు ధరల వివాదాలు, ఖరీదైన ఏర్పాట్లు వంటివి తలెత్తవచ్చు. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (APERC) ఈ కొత్త లైసెన్సులను నియంత్రించడంతో పాటు, మొత్తం గ్రిడ్ స్థిరత్వాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా కలిగి ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్ తీసుకున్న ఈ కొత్త విధానం, దేశంలో భారీ స్థాయి పారిశ్రామిక విద్యుత్ సేకరణకు ఒక కొత్త నమూనా కానుంది. ఇది పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు, సరసమైన విద్యుత్ పంపిణీని ఎలా సమతుల్యం చేస్తుందనేది కీలకం.
