2026 నాటికి ఢిల్లీని స్టార్టప్ హబ్గా మార్చే లక్ష్యంతో, ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక స్టార్టప్ మరియు ఇంక్యుబేషన్ పాలసీని రూపొందిస్తోంది. ఇందులో భాగంగా ఈరోజు ఇండస్ట్రీ నిపుణులతో ఒక కీలకమైన రౌండ్టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
ఢిల్లీని గ్లోబల్ స్టార్టప్ హబ్గా నిలబెట్టాలన్న లక్ష్యంతో, ఢిల్లీ ప్రభుత్వం ఈరోజు 'The Lalit' హోటల్లో ఉన్నత స్థాయి రౌండ్టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తోంది. ముఖ్యమంత్రి రేఖ గుప్తా ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సమావేశంలో, రాబోయే 2026 స్టార్టప్ అండ్ ఇంక్యుబేషన్ పాలసీ రోడ్మ్యాప్ను ఖరారు చేయనున్నారు. 'విక్షిత్ భారత్ 2047' లక్ష్యానికి అనుగుణంగా, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఎదురవుతున్న అడ్డంకులను తొలగించడమే ఈ భేటీ ప్రధాన ఉద్దేశ్యం.
ఎవరెవరు పాల్గొన్నారు?
ఈ కీలక సమావేశానికి భారత స్టార్టప్ రంగానికి చెందిన ప్రముఖులు హాజరయ్యారు. వీరిలో Info Edge వ్యవస్థాపకులు సంజీవ్ భిక్షాందానీ, Snapdeal సహ-వ్యవస్థాపకులు కునాల్ బహ్ల్, boAt వ్యవస్థాపకులు అమన్ గుప్తా మరియు అనన్య బిర్లా ఉన్నారు. పాలసీ రూపకల్పనలో భాగంగా వెంచర్ క్యాపిటల్ నిపుణులు, స్టార్టప్ ఫౌండర్ల నుంచి నేరుగా ఫీడ్బ్యాక్ తీసుకుని, కంప్లయన్స్ భారాన్ని తగ్గించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది.
పోటీలో ఢిల్లీ..
ప్రస్తుతం స్టార్టప్ రంగంలో బెంగళూరు, హైదరాబాద్ నగరాలు అగ్రస్థానంలో ఉన్నాయి. వీటితో పోటీ పడేందుకు ఢిల్లీ సర్కార్ ఇప్పుడు కేవలం ట్యాక్స్ ఇన్సెంటివ్లకే పరిమితం కాకుండా, ఆఫీస్ స్పేస్ అందుబాటులో ఉంచడం, సులభతర వాణిజ్యం (Ease of Doing Business) మరియు స్థానికంగా ఫండింగ్ సౌకర్యాలు కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది.
పెట్టుబడిదారుల ఆశలు
గతంలో చాలా రాష్ట్రాలు ప్రకటించిన పాలసీలు క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోలేదు. బ్యూరోక్రాటిక్ జాప్యం వల్ల స్టార్టప్లు ఇబ్బందులు పడ్డాయి. అందుకే, ఇప్పుడు ప్రభుత్వం తీసుకొచ్చే కొత్త పాలసీలో అమలు కాలక్రమం (Implementation Timeline) ఎలా ఉండబోతుందనేది ఇన్వెస్టర్లలో ఆసక్తిని కలిగిస్తోంది. పాలసీ ముసాయిదా విడుదలైన తర్వాత, రియల్ టైమ్ ఇంప్లిమెంటేషన్పైనే ఢిల్లీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.
