అక్టోబర్ 15, 2026 నుంచి UPI పేమెంట్స్పై కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. రూ. 2,000 దాటిన మర్చంట్ లావాదేవీలపై గరిష్టంగా 0.4% ఫీజు వసూలు చేయనున్నారు. అయితే, సాధారణ వినియోగదారులకు, చిన్న వ్యాపారులకు ఈ ఛార్జీల నుంచి మినహాయింపు ఉంది.
భారతీయ డిజిటల్ పేమెంట్ రంగంలో కీలక మార్పులు రాబోతున్నాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) అక్టోబర్ 15, 2026 నుంచి కొత్త మెర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) విధానాన్ని ప్రవేశపెడుతోంది. దీని ప్రకారం, రూ. 2,000 దాటిన మర్చంట్ యూపీఐ ట్రాన్సాక్షన్లపై 0.4% వరకు ఫీజు వసూలు చేస్తారు. ఈ చర్య డిజిటల్ పేమెంట్ నెట్వర్క్ నిర్వహణను మరింత సుస్థిరం చేసేందుకు ఉద్దేశించినది.
ఎందుకు ఈ నిర్ణయం?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ చైర్మన్, ప్రస్తుతం మాస్టర్కార్డ్ ఇండియా ఛైర్మన్గా ఉన్న రజనీష్ కుమార్ ఈ నిర్ణయాన్ని సమర్థించారు. డిజిటల్ నెట్వర్క్ను సురక్షితంగా ఉంచడం, ఫ్రాడ్స్ను అరికట్టడం మరియు రెగ్యులేటరీ నిబంధనలను పాటించడం వంటి పనుల కోసం బ్యాంకులు, పేమెంట్ ప్రాసెసర్లు ఏటా రూ. 20,000 కోట్ల నష్టాన్ని చవిచూస్తున్నాయి. ఈ వ్యయాన్ని భరించడం కష్టతరంగా మారడంతో, మౌలిక సదుపాయాల కల్పన కోసం ఈ ఫీజు అనివార్యమని ఆయన అభిప్రాయపడ్డారు.
ఫీజు స్ట్రక్చర్ ఎలా ఉంటుంది?
- గరిష్ట పరిమితి: 0.4% అనేది గరిష్ట ఫీజు మాత్రమే, కాబట్టి పోటీని బట్టి ఇది తగ్గే అవకాశం ఉంది.
- వినియోగదారులకు: కస్టమర్లపై ఎలాంటి అదనపు భారం ఉండదు. వ్యాపారులు ఈ ఖర్చును కస్టమర్ల నుంచి వసూలు చేయకూడదని నిబంధన విధించారు.
- వివిధ రంగాలు: ఇంధనం, ఇన్సూరెన్స్, యూటిలిటీ బిల్లులకు రూ. 5 ఫ్లాట్ ఫీజు ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ పేమెంట్స్కు 0.02% MDR మాత్రమే ఉంటుంది.
ఎవరికి మినహాయింపు?
చిన్న వ్యాపారులకు ఆర్థిక ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. నెలకు రూ. 1 లక్ష కంటే తక్కువ టర్నోవర్ ఉన్న క్యూఆర్ కోడ్ (QR Code) మర్చంట్లు, వ్యక్తిగత లావాదేవీలు (P2P), మరియు రూ. 2,000 లోపు ఉన్న అన్ని రిటైల్ లావాదేవీలకు ఎటువంటి ఛార్జీలు వర్తించవు.
