SEBI తన కొత్త సర్క్యులర్లో కీలక విషయాలు వెల్లడించింది. ఫిబ్రవరి 5, 2026 నుండి ఫిబ్రవరి 4, 2027 వరకు, ఒక సంవత్సరం పాటు, తమ పాత ఫిజికల్ షేర్ సర్టిఫికెట్లను ఎలక్ట్రానిక్ (డీమెట్) రూపంలోకి మార్చుకోవడానికి ఇన్వెస్టర్లకు ఒక ప్రత్యేక అవకాశం కల్పించనుంది. ముఖ్యంగా, ఏప్రిల్ 1, 2019 నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొన్న వారికి, లేదా వివిధ కారణాల వల్ల తమ ఫిజికల్ హోల్డింగ్స్ను డీమ్యాట్ చేయించుకోలేకపోయిన వారికి ఇది ఒక గొప్ప రిలీఫ్.
ఏప్రిల్ 1, 2019 నుండి అన్ని షేర్ల బదిలీలు తప్పనిసరిగా డీమెటీరియలైజ్డ్ రూపంలోనే జరగాలని SEBI గతంలో ఆదేశించింది. దీని ప్రధాన ఉద్దేశ్యం మార్కెట్లో పారదర్శకతను పెంచడం, మోసపూరిత లావాదేవీలను అరికట్టడం. అయితే, చాలా మంది పాత ఇన్వెస్టర్లు, అసంపూర్తిగా ఉన్న డాక్యుమెంట్లు, లేదా గతంలో అప్లికేషన్లు తిరస్కరణకు గురికావడం వంటి కారణాలతో ఈ నిబంధనలను పాటించలేకపోయారు.
ఇప్పుడు SEBI తెరుస్తున్న ఈ ప్రత్యేక విండో, అలాంటి ఇన్వెస్టర్లకు సుదీర్ఘమైన చట్టపరమైన ప్రక్రియల జోలికి వెళ్లకుండానే తమ యాజమాన్య హక్కులను రెగ్యులరైజ్ చేసుకోవడానికి ఒక మార్గాన్ని అందిస్తుంది. దీని ద్వారా, తమ ఆస్తులను యాక్సెస్ చేయలేక ఇబ్బంది పడుతున్న వారికి సరైన పరిష్కారం లభిస్తుంది. ఈ సర్క్యులర్ నిబంధనలు ఫిబ్రవరి 5, 2026 నుండి అమల్లోకి వస్తాయి, కాబట్టి ఇన్వెస్టర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు.