జులై 1, 2027 నుంచి కొత్తగా వచ్చే సోలార్ మరియు విండ్ పవర్ ప్రాజెక్టులలో బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్స్ తప్పనిసరి చేస్తూ Central Electricity Authority (CEA) ముసాయిదా నిబంధనలను విడుదల చేసింది. దీనివల్ల విద్యుత్ వృధా తగ్గుతుంది కానీ, కంపెనీలకు ప్రాజెక్ట్ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది.
నిబంధనల వెనుక ఉన్న అసలు లక్ష్యం
భారతదేశ పవర్ గ్రిడ్ని మరింత బలోపేతం చేసే దిశగా సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (CEA) ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై కొత్తగా ప్రారంభమయ్యే సోలార్ మరియు ఆన్షోర్ విండ్ ప్రాజెక్టులకు బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్స్ ఉండటం తప్పనిసరి. ఈ నిబంధనలు జులై 1, 2027 నుంచి అమలులోకి రానున్నాయి.
కీలక నిబంధనలు ఇవే:
- స్టోరేజ్ కెపాసిటీ: ప్రాజెక్ట్ మొత్తం సామర్థ్యంలో కనీసం 10% బ్యాటరీ స్టోరేజ్ ఉండాలి.
- సమయ పరిమితి: 2027 మధ్య నుంచి 2 గంటల స్టోరేజ్ ఉండగా, 2029 జులై నుంచి 2031 జూన్ మధ్య వచ్చే ప్రాజెక్టులకు ఇది 4 గంటలకు పెరుగుతుంది.
- గ్రిడ్-ఫార్మింగ్ టెక్నాలజీ: కనీసం 15% ఇన్వర్టర్లు మరియు పవర్ కన్వర్షన్ సిస్టమ్స్ గ్రిడ్-ఫార్మింగ్ టెక్నాలజీతో ఉండాలి. దీనివల్ల గ్రిడ్ ఫ్రీక్వెన్సీ స్థిరంగా ఉండి, విద్యుత్ అంతరాయాలు తగ్గుతాయి.
వృధాకు చెక్
గతంలో సౌర విద్యుత్ ఉత్పత్తి ఎక్కువైనప్పుడు, దాన్ని దాచుకునే అవకాశం లేక గ్రిడ్లోకి పంపలేకపోయేవాళ్లం. దీనివల్ల కేవలం ఒక క్వార్టర్లోనే 8,133 GWh సౌర విద్యుత్ వృధా (Curtailment) అయ్యింది. బ్యాటరీ స్టోరేజ్ ఉండటం వల్ల పగలు సేకరించిన విద్యుత్తును సాయంత్రం వేళల్లో వినియోగించుకోవచ్చు.
ఇన్వెస్టర్లకు ఎదురయ్యే సవాళ్లు
ఈ కొత్త రూల్స్ వల్ల ప్రాజెక్ట్ నిర్మాణం కోసం అయ్యే ప్రారంభ వ్యయం (Upfront Capital) భారీగా పెరుగుతుంది. ఈ అదనపు భారాన్ని కంపెనీలు డిస్కంల (DISCOMs) పైకి నెట్టగలవా లేదా అనేది ఇప్పుడు కీలకం. ఒకవేళ డిస్కంల నుంచి పేమెంట్స్ ఆలస్యమైతే, కంపెనీల క్యాష్ ఫ్లోపై ఒత్తిడి పడే అవకాశం ఉంది. అలాగే, బ్యాటరీల కోసం దిగుమతులపై ఆధారపడటం కూడా ఒక సప్లై చైన్ రిస్క్గా మారింది. ఈ ముసాయిదాపై అక్టోబర్ 4, 2026 వరకు ప్రజలు, సంస్థల నుంచి అభిప్రాయాలను కోరింది CEA.
