ప్రభుత్వ సలహాతో రియల్టీ రంగంలో ఆందోళనలు
దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల వర్క్ ఫ్రమ్ హోమ్ (WFH) మోడళ్లకు మద్దతుగా ఇచ్చిన సూచనలు.. భారత్ కమర్షియల్ రియల్ ఎస్టేట్ రంగంలో ఆందోళనలు రేకెత్తించాయి. పశ్చిమ ఆసియాలో నెలకొన్న సంఘర్షణ, పెరుగుతున్న ఇంధన భయాల నేపథ్యంలో ఈ సలహా వచ్చింది. ఇప్పటికే ప్రీ-పాండమిక్ స్థాయిలకు చేరుకుంటున్న మార్కెట్, ఇప్పుడు కొత్త సవాళ్లను ఎదుర్కోనుంది.
అద్దె దిగుబడులు తగ్గే అవకాశం
విశ్లేషకుల అంచనాల ప్రకారం, రాబోయే మూడు నుంచి ఆరు నెలల వ్యవధిలో కమర్షియల్ అద్దె దిగుబడులు (Rental Yields) 5% నుండి 6% వరకు తగ్గుముఖం పట్టొచ్చు. అంతర్జాతీయ ఉద్రిక్తతలు కొనసాగితే, కంపెనీలు రిమోట్ వర్క్ పాలసీలను అమలు చేస్తే ఈ ప్రభావం మరింత స్పష్టంగా కనిపిస్తుంది. దీర్ఘకాలికంగా రిమోట్ లేదా హైబ్రిడ్ వర్క్ వైపు మారడం వల్ల ఆఫీస్ స్పేస్కు డిమాండ్ తగ్గడం, లీజు రెన్యూవల్స్పై ప్రభావం చూపడం, రెంటల్ విలువలు తగ్గడం వంటి పరిణామాలు చోటుచేసుకోవచ్చని డెవలపర్లు, లీజింగ్ కన్సల్టెంట్లు పేర్కొంటున్నారు.
మార్కెట్లలో వైవిధ్యం
ఒకే రకమైన ప్రభావం అన్ని నగరాల్లో ఉండకపోవచ్చు. ముంబై వంటి ప్రధాన వాణిజ్య కేంద్రాలలో కమర్షియల్ ప్రాపర్టీ డీల్స్ దాదాపు 40% వరకు తగ్గడం, లీజు ఒప్పందాలు మందగించడం వంటి పరిణామాలు ఇప్పటికే నమోదయ్యాయి. అయితే, హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలు మాత్రం కొంతవరకు స్థిరంగా ఉన్నాయి. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (GCCs), మల్టీనేషనల్ టెక్నాలజీ సంస్థల నుంచి వస్తున్న బలమైన డిమాండ్ వీటిని ఆదుకుంటోంది. ఈ దక్షిణ నగరాల్లో GCCల విస్తరణ ఇప్పటికీ డిమాండ్కు ఊతమిస్తోందని కన్సల్టెంట్లు వివరిస్తున్నారు.
కో-వర్కింగ్, విస్తరణ ప్రణాళికలపై అనిశ్చితి
ఫైనాన్షియల్ సర్వీసెస్, కన్సల్టింగ్, టెక్నాలజీ వంటి రంగాల్లోని కంపెనీలు గ్లోబల్ పరిస్థితులు చక్కబడే వరకు పెద్ద ఎత్తున ఆఫీస్ స్పేస్ల కొనుగోలును వాయిదా వేసుకుంటున్నాయి. ఈ జాగ్రత్తతో కూడిన వైఖరి.. కో-వర్కింగ్ స్పేస్లకు డిమాండ్ తగ్గడానికి, కంపెనీల విస్తరణ ప్రణాళికలు ఆలస్యం కావడానికి దారితీసే ప్రమాదం ఉంది.
