ఎయిర్పోర్ట్ దగ్గర నిర్మాణాలకు NOC అనుమతుల ప్రక్రియను కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సరళీకృతం చేస్తోంది. ఇకపై స్థానిక సంస్థల ద్వారానే అనుమతులు జారీ చేసేలా ప్లాన్ చేస్తూ, భవన నిర్మాణ ఎత్తు పరిమితులపై స్పష్టతనిస్తోంది.
విమానాశ్రయాల సమీపంలో భవనాల నిర్మాణానికి అవసరమైన 'నో అబ్జెక్షన్ సర్టిఫికెట్' (NOC) ప్రక్రియను సులభతరం చేసేందుకు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం బిల్డర్లు Airports Authority of India (AAI) చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉంది. దీనిని మార్చేందుకు మంత్రి కె. రామ్మోహన్ నాయుడు, 15 రోజుల్లో కొత్త ఫ్రేమ్వర్క్ను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
స్థానిక సంస్థలకే కీలక బాధ్యతలు
ఈ కొత్త విధానంలో అతిపెద్ద మార్పు ఏంటంటే.. NOC జారీ చేసే అధికారాన్ని ఇకపై స్థానిక మున్సిపల్ బాడీలకు బదిలీ చేయనున్నారు. ఇప్పటివరకు ఈ అనుమతుల కోసం నెలల తరబడి వేచి చూడాల్సి వచ్చేది. ఇప్పుడు అనుమతుల ప్రక్రియ ఆటోమేటెడ్ మరియు టైమ్-బౌండ్గా మారనుంది. దీనివల్ల ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లో పెండింగ్లో ఉన్న రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు ఊపిరి పీల్చుకునే అవకాశం ఉంది.
ఎత్తుపై ముందే స్పష్టత
నిర్మాణాల్లో తరచుగా వచ్చే మరో సమస్య - భవన ఎత్తు. ప్రాజెక్ట్ చివర్లో ఎత్తు విషయంలో ఆంక్షలు ఎదురై, బిల్డర్లు భారీగా నష్టపోయే వారు. దీన్ని నివారించేందుకు, ప్రాజెక్ట్ ప్రారంభంలోనే గరిష్టంగా ఎంత ఎత్తు వరకు అనుమతిస్తారో స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది.
భద్రతతో రాజీ లేదు
రియల్ ఎస్టేట్ రంగానికి మేలు జరుగుతున్నప్పటికీ, విమానయాన భద్రత విషయంలో మాత్రం ప్రభుత్వం రాజీ పడటం లేదు. విమానాల రాకపోకలకు ఆటంకం కలగకుండా 20 కిలోమీటర్ల పరిధి నుంచి 56 కిలోమీటర్ల వరకు నిబంధనలు అమల్లో ఉంటాయి. స్థానిక సంస్థలు ఈ సాంకేతిక అంశాలను, రాడార్ ఇంటర్ఫరెన్స్ను ఎంతవరకు సమర్థవంతంగా హ్యాండిల్ చేస్తాయనేదే ఇప్పుడు ఇన్వెస్టర్లు గమనించాల్సిన ప్రధాన అంశం.
