ఫిన్టెక్ కంపెనీలు కస్టమర్ల డేటాను కేవలం లాభాల కోసం వాడే వస్తువుగా చూడకూడదని RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పష్టం చేశారు. కంపెనీలు పెరిగేకొద్దీ బాధ్యత కూడా పెరుగుతుందని, భవిష్యత్తులో సైబర్ సెక్యూరిటీ, ఆపరేషనల్ రిస్క్లపై కఠిన నిబంధనలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.
ముంబైలో జరిగిన గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్లో RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఫిన్టెక్ రంగానికి దిశానిర్దేశం చేశారు. కస్టమర్ డేటాను సొమ్ము చేసుకునే వస్తువుగా కాకుండా, ఒక బాధ్యతగా (Fiduciary Responsibility) భావించాలని ఆయన స్పష్టం చేశారు. లాభాల కోసం కస్టమర్ల నమ్మకాన్ని దెబ్బతీస్తే, అది మొత్తం ఫైనాన్షియల్ సిస్టమ్ స్థిరత్వానికి ప్రమాదమని ఆయన హెచ్చరించారు.
సంస్థల విస్తరణ - పెరిగిన బాధ్యత
స్టార్టప్ దశలో ఉన్నప్పుడు ఉన్న వెసులుబాట్లు, సంస్థలు పెద్దవిగా మారిన తర్వాత ఉండవని గవర్నర్ గుర్తుచేశారు. ఒక కంపెనీ వైఫల్యం మొత్తం వ్యవస్థను దెబ్బతీసే స్థాయికి చేరుకున్నప్పుడు, ఆ సంస్థ నిబంధనలను అతిక్రమించే అవకాశం లేదని ఆయన తెలిపారు. ఫిన్టెక్ సంస్థల బాధ్యతలు కేవలం బ్యాలెన్స్ షీట్లకే పరిమితం కాకుండా, సైబర్ సెక్యూరిటీ, వ్యాపార కొనసాగింపు వంటి కీలక అంశాలపై కూడా ఉంటాయని చెప్పారు. ఇది ఇన్వెస్టర్లకు ముఖ్యమైన సంకేతం.. రాబోయే రోజుల్లో పెద్ద ఫిన్టెక్ కంపెనీలకు కంప్లయన్స్ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది.
AI, స్పీడ్ మరియు సిస్టమిక్ రిస్క్
RBI డిప్యూటీ గవర్నర్ రోహిత్ జైన్ మాట్లాడుతూ.. ఆధునిక సాంకేతికత వల్ల ఎదురయ్యే మూడు ప్రధాన ముప్పులను ప్రస్తావించారు: అవి వేగం (Speed), కేంద్రీకరణ (Concentration), మరియు పారదర్శకత లేకపోవడం (Opacity). AI నిర్ణయాల వల్ల వచ్చే పొరపాట్లు, కొన్ని క్లౌడ్ టెక్నాలజీ ప్రొవైడర్లపైనే అతిగా ఆధారపడటం వల్ల వ్యవస్థలో ఒడిదుడుకులు వచ్చే ప్రమాదం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
నిబంధనల పట్ల పారదర్శకత
ప్రస్తుత నిబంధనల్లోని లొసుగులను వాడుకుని వ్యాపార నమూనాలను నిర్మించడం సరికాదని RBI హెచ్చరించింది. సంస్థలు తమ సేవలను ప్రారంభించే ముందే 'రెగ్యులేటరీ శాండ్బాక్స్ల' ద్వారా అనుమతులు తీసుకోవాలని సూచించింది. 'యునైటెడ్ ఫిన్టెక్ ఫోరం'ను సెల్ఫ్-రెగ్యులేటరీ ఆర్గనైజేషన్ (SRO)గా గుర్తించడం ద్వారా, పరిశ్రమ తనంతట తానే నియంత్రించుకోవాల్సిన అవసరం పెరిగిందని సంకేతాలు వెలువడ్డాయి.
