హాస్పిటల్ అపాయింట్మెంట్ల పేరుతో కేరళ పోలీసులు ఆందోళనకరమైన హెచ్చరిక జారీ చేశారు. ఫేక్ యాప్స్ ద్వారా యూజర్ల ఫోన్లలో మాల్వేర్ను ఇన్స్టాల్ చేసి, OTPలను దొంగిలించి UPI ఖాతాల నుండి నగదును కొల్లగొడుతున్నారు.
ఆసుపత్రుల్లో అపాయింట్మెంట్లు బుక్ చేసుకునే క్రమంలో ప్రజలు సైబర్ నేరగాళ్ల వలలో పడుతున్నారు. గూగుల్ సెర్చ్లో కనిపించే నకిలీ కస్టమర్ కేర్ నంబర్లకు ఫోన్ చేసినప్పుడు, వారు వాట్సాప్ ద్వారా కొన్ని యాప్ ఫైళ్లను పంపి, వాటిని ఇన్స్టాల్ చేయాలని నమ్మిస్తున్నారు. ఇలా ఇన్స్టాల్ చేసిన యాప్స్ మీ స్మార్ట్ఫోన్ నియంత్రణను పూర్తిగా తమ చేతుల్లోకి తీసుకుంటున్నాయి.
ఈ స్కామ్ ఎలా జరుగుతోంది?
ఈ మాల్వేర్ యాప్స్ మీ ఫోన్ లోని SMS లను గమనిస్తాయి. తద్వారా బ్యాంక్ ట్రాన్సాక్షన్లకు సంబంధించిన OTP లను ఇంటర్సెప్ట్ చేసి, UPI Lite వంటి సేవలను ఉపయోగించి చిన్న మొత్తాల్లో నగదును మీ ఖాతా నుండి తరలిస్తాయి. లావాదేవీల విలువ తక్కువగా ఉండటంతో, చాలామందికి తమ ఖాతా నుంచి డబ్బులు కట్ అవుతున్నట్లు తక్షణమే గుర్తించడం సాధ్యం కావడం లేదు.
జాగ్రత్తలు ఇవే:
- అధికారిక యాప్స్ మాత్రమే: Google Play Store నుండి మాత్రమే యాప్స్ డౌన్లోడ్ చేయండి. వాట్సాప్ లేదా తెలియని లింకుల ద్వారా వచ్చే ఫైళ్లను అసలు ఓపెన్ చేయకండి.
- పర్మిషన్స్: ఏ యాప్ అయినా SMS, కాంటాక్ట్స్, నోటిఫికేషన్ల కోసం పర్మిషన్ అడిగితే జాగ్రత్తగా ఉండండి.
- ముందస్తు చర్యలు: ఒకవేళ మీరు ఏదైనా అనుమానాస్పద యాప్ ఇన్స్టాల్ చేశారనిపిస్తే, వెంటనే ఫోన్ ఇంటర్నెట్ ఆఫ్ చేయండి. మీ బ్యాంకును సంప్రదించి ఖాతాను ఫ్రీజ్ చేయండి.
- హెల్ప్ లైన్: ఏదైనా సైబర్ మోసం జరిగితే వెంటనే 1930 నంబర్కు డయల్ చేసి నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్కు ఫిర్యాదు చేయండి.
