లిస్టింగ్ రోజున ఉత్సాహం, తర్వాత నిరాశ
ఏప్రిల్ 30, 2026 నాటికి అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం, జనవరి 2025 నుండి మార్చి 2026 మధ్య మార్కెట్లోకి వచ్చిన 115 ఐపీఓలలో దాదాపు 58.2% వాటి ఆఫర్ ధర కంటే తక్కువకే ట్రేడ్ అవుతున్నాయి. ఇది, లిస్టింగ్ రోజున 61.7% ఐపీఓలు సానుకూల గెయిన్స్ తో, తమ ఇష్యూ ధర కంటే ఎక్కువగా ముగిసినదానికి పూర్తి విరుద్ధం.
లిస్టింగ్ తర్వాత ఈ షేర్లను దీర్ఘకాలం పాటు హోల్డ్ చేసిన ఇన్వెస్టర్లకు తీవ్ర నిరాశ ఎదురైంది. వారికి మీడియన్ రిటర్న్ -14% ఉండగా, యావరేజ్ రిటర్న్ -6.85% గా నమోదైంది. ఈ నష్టాలు విస్తృతంగా కనిపిస్తున్నాయి.
అధిక వాల్యుయేషన్స్, స్పెక్యులేషన్ కారణమా?
ఈ వ్యత్యాసానికి ప్రధాన కారణం.. చాలా ఐపీఓలను వాటి అసలు విలువ కంటే ఎక్కువగా (High Valuations) లిస్ట్ చేయడం. దీనివల్ల ట్రేడింగ్ మొదలైన తర్వాత పెరగడానికి పెద్దగా అవకాశం ఉండట్లేదు. మార్కెట్ సెంటిమెంట్ మారడంతో, ఈ ఐపీఓలు దీర్ఘకాలిక పెట్టుబడుల కంటే స్వల్పకాలిక స్పెక్యులేటివ్ ట్రేడింగ్ అవకాశాలుగా మారుతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
PRIME Database Group మేనేజింగ్ డైరెక్టర్ ప్రణవ్ హల్దియా మాట్లాడుతూ, 'ఐపీఓలన్నీ ఎప్పుడూ ఇష్యూ ధర కంటే ఎక్కువగా ట్రేడ్ అవుతాయని ఆశించడం సరికాదు. లిస్టింగ్ తర్వాత పనితీరు అనేది కంపెనీ ఫండమెంటల్స్, సెక్టార్ ట్రెండ్స్, ఆర్థిక పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది' అని తెలిపారు. ప్రస్తుతం మార్కెట్ 'ప్రాఫిటబిలిటీ ప్రీమియం'ని డిమాండ్ చేస్తోంది. స్పష్టమైన ఎర్నింగ్స్ కనిపించని, బలమైన బిజినెస్ మోడల్స్ లేని ఖరీదైన ఐపీఓలను శిక్షిస్తోంది. దీంతో, 2025లో వచ్చిన స్టార్టప్ ఐపీఓలలో దాదాపు 55% మార్చి 2026 నాటికి ఇష్యూ ధర కంటే తక్కువకే ట్రేడ్ అవుతున్నాయి. కేవలం హైప్ తో ప్రీమియం వాల్యుయేషన్స్ దక్కించుకోవడం ఇక కుదరదని ఇది చెబుతోంది.
గ్లోబల్, దేశీయ ఆర్థిక ప్రభావాలు
భారత ఈక్విటీ మార్కెట్ (సెన్సెక్స్, నిఫ్టీ) రూపీ టర్మ్స్ లో 2025లో లాభపడ్డా, కరెన్సీ డిప్రిసియేషన్, విదేశీ పెట్టుబడిదారుల భారీ అవుట్ ఫ్లోల వల్ల డాలర్ టర్మ్స్ లో గ్లోబల్ గా పేలవంగా పనిచేసింది. ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ (FIIs) 2025, 2026 తొలి నాళ్లలో బిలియన్ల కొద్దీ డబ్బును వెనక్కి తీసుకున్నారు. దీనికి కరెన్సీ సమస్యలు, అధిక వాల్యుయేషన్స్, గ్లోబల్ అనిశ్చితులు కారణాలుగా పేర్కొన్నారు. దీనివల్ల మార్కెట్ లిక్విడిటీ తగ్గి, కొత్త లిస్టింగ్స్ పై ఆసక్తి తగ్గింది. దేశీయ సంస్థాగత, రిటైల్ ఇన్వెస్టర్ల పెట్టుబడులు కొంత సపోర్ట్ ఇచ్చాయి.
భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల పెరిగిన ఆయిల్ ధరలు, సంభావ్య ద్రవ్యోల్బణం వంటి ఆర్థిక సవాళ్లు కార్పొరేట్ లాభాలపై, ఇన్వెస్టర్ల సెంటిమెంట్ పై ఒత్తిడి తెస్తున్నాయి. 2026, 2027 ఆర్థిక సంవత్సరాలకు 6.5%-7.7% వృద్ధి అంచనాలు ఉన్నప్పటికీ, మార్కెట్ అప్రమత్తంగానే ఉంది. 2026 మే తొలి నాళ్లలో ఇండియన్ రూపాయి యూఎస్ డాలర్ తో పోలిస్తే రికార్డు కనిష్టాలకు పడిపోయింది, ఇది దిగుమతి ఖర్చులను పెంచి, ఇన్వెస్టర్ సెంటిమెంట్ ను దెబ్బతీసింది.
భవిష్యత్తు కార్యాచరణ
లిస్టింగ్-డే పాప్స్ తర్వాత పడిపోవడం అనేది ఐపీఓలను ఎలా అప్రోచ్ చేస్తున్నారనే దానిపై ఉన్న నిర్మాణపరమైన బలహీనతలను సూచిస్తోంది. అతిగా వాల్యుయేషన్స్ చేయడం, తొలి పెట్టుబడిదారులు మార్కెట్ ఉత్సాహాన్ని ఉపయోగించుకుని లాభాలకు ఎగ్జిట్ అవ్వడం వంటివి జరుగుతున్నాయి. గతంలో ఐపీఓలు స్థిరమైన రాబడులను అందించినట్లు కాకుండా, ప్రస్తుత మార్కెట్ స్పష్టమైన లాభదాయకతను, సమర్థవంతమైన మూలధన వినియోగ ప్రణాళికలను డిమాండ్ చేస్తోంది.
భారతదేశ ఐపీఓ పైప్లైన్ బలంగానే ఉంది. అయితే, మార్కెట్ పరిణితి చెందుతోంది. పెట్టుబడిదారులు వాల్యుయేషన్లను మరింత జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు, స్పష్టమైన ఎర్నింగ్స్, బలమైన బ్యాలెన్స్ షీట్లు, విశ్వసనీయ వృద్ధి వ్యూహాలున్న కంపెనీలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. లిస్టింగ్-డే గెయిన్స్ కొనసాగవచ్చు, కానీ వాటి స్థిరత్వం ప్రశ్నార్థకమే. భవిష్యత్తులో ఐపీఓ మార్కెట్ విజయం అనేది నాణ్యమైన కంపెనీలను గుర్తించడం, వాటి నిజమైన వ్యాపార విలువను అర్థం చేసుకోవడంపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది.
