వాణిజ్య స్వరూపం మారుతోంది
ప్రపంచ ఆర్ధిక వేదికపై వ్యూహాత్మక భాగస్వామ్యాలు కొత్త రూపు సంతరించుకుంటున్నాయి. భారత్, రష్యా, యూఏఈల మధ్య వాణిజ్యం గణనీయంగా పెరిగింది. FY21లో సుమారు $13 బిలియన్లుగా ఉన్న ఈ వ్యాపారం, FY25 నాటికి $69 బిలియన్లకు చేరుకుంటుందని అంచనా. దీనికి ప్రధాన కారణం ఇంధన రంగమే. భారత్ దిగుమతి చేసుకునే క్రూడ్ ఆయిల్లో రష్యా వాటా 2% నుంచి దాదాపు 40% కి పెరిగింది.
అదే సమయంలో, భారత్-యూఏఈ మధ్య వాణిజ్యం FY21లో $43 బిలియన్ల నుంచి FY25 నాటికి $100 బిలియన్ల మార్కును దాటింది. యూఏఈతో పదేళ్ల LNG ఒప్పందం భారత్కు ఆ దేశాన్ని రెండవ అతిపెద్ద LNG సరఫరాదారుగా నిలబెట్టింది.
ప్రత్యామ్నాయ చెల్లింపుల వ్యవస్థల ఏర్పాటు
ఈ పెరుగుతున్న వాణిజ్యం కేవలం నగదు చెల్లింపులకే పరిమితం కావడం లేదు. రష్యా తన వాణిజ్యం ద్వారా పోగుపడిన మిగులు రూపాయిలను (surplus rupees) భారత్ మార్కెట్లలో పెట్టుబడిగా పెట్టడం ప్రారంభించింది. Sberbank వంటి సంస్థలు అందించే Nifty 50 ఫండ్ వంటివి దీనికి ఉదాహరణ. ఈ విధానం ద్వారా, అంతర్జాతీయంగా ఆధిపత్యం చెలాయించే డాలర్ ఆధారిత చెల్లింపుల వ్యవస్థను తప్పించుకుంటున్నారు. ఇది డీ-డాలరైజేషన్ (de-dollarization) వైపు ఒక ముఖ్యమైన అడుగు.
బహుళ ధ్రువ ఆర్ధిక వ్యవస్థ దిశగా
ఇంధన రంగంతో పాటు, ఇతర రంగాల్లోనూ భారత్, రష్యా, యూఏఈల పెట్టుబడులు విస్తరిస్తున్నాయి. ఇది కేవలం ప్రస్తుత అవసరాలకే కాకుండా, దీర్ఘకాలిక వ్యూహమని స్పష్టం చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కూడా అమెరికా, చైనా, యూరప్, భారత్ వంటి పలు ఆర్ధిక శక్తులు తమ ప్రభావాన్ని చూపుతూ, ఒక బహుళ ధ్రువ ఆర్ధిక వ్యవస్థ (multipolarity) రూపుదిద్దుకుంటోంది.
గల్ఫ్ దేశాల సార్వభౌమ సంపద నిధులు (Sovereign Wealth Funds - SWFs) భారత్లోని పునరుత్పాదక ఇంధనం, మౌలిక సదుపాయాలు, ఆరోగ్య సంరక్షణ రంగాల్లో పెట్టుబడులు పెంచుతున్నాయి. ADIA, Mubadala, ADQ వంటి సంస్థలు ఈ విషయంలో ముందున్నాయి.
ఇక, ఖండాలను అనుసంధానం చేసే భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు కూడా ఊపందుకున్నాయి. ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్ (IMEC) వంటివి దీనికి ఉదాహరణ. రైలు, నౌకాయానం, ఇంధనం, డిజిటల్ నెట్వర్క్ల ద్వారా ఇది అనుసంధానం అవుతుంది. చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్కు ఇది ఒక ప్రత్యామ్నాయంగా పరిగణించబడుతోంది.
సవాళ్లు, అనిశ్చితులు
అయితే, ఈ కొత్త ఆర్ధిక కూటములకు కొన్ని సవాళ్లు కూడా ఎదురవుతున్నాయి. పాశ్చాత్య దేశాల ఆంక్షలు, ముఖ్యంగా ద్వితీయ ఆంక్షలు (secondary sanctions) వాణిజ్య సంబంధాలపై ప్రభావం చూపుతున్నాయి. ఉదాహరణకు, నిబంధనల పాటించడంలో ఇబ్బందులు, అమెరికా ఆంక్షల కారణంగా 2025లో భారత్ రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ దిగుమతులు సుమారు 18% తగ్గాయి. దీంతో భారత్ యూఎస్, యూఏఈ వైపు మళ్లాల్సి వచ్చింది.
IMEC ప్రాజెక్ట్ కూడా మధ్య ప్రాచ్యంలోని భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, భారత్-అమెరికా వాణిజ్యపరమైన విభేదాల వల్ల అమలులో అనిశ్చితిని ఎదుర్కొంటోంది.
గల్ఫ్ ప్రాంతంలో చైనా ఆర్థిక భాగస్వామ్యాలు పెరగడం, యూరోపియన్ యూనియన్ అంతర్గత విభేదాలు.. యూరప్ తన ప్రభావాన్ని నిలుపుకోవడానికి అడ్డంకిగా మారాయి. డాలర్ ఆధారిత వ్యవస్థ నుంచి పూర్తిగా బయటపడటం ప్రస్తుత పరిస్థితుల్లో కష్టమే.
భవిష్యత్ అంచనాలు
భవిష్యత్తులో ప్రపంచ కరెన్సీ వ్యవస్థలో నెమ్మదిగా మార్పులు వస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. డాలర్ ఆధిపత్యం కొనసాగినా, ఇతర ప్రధాన కరెన్సీలు కూడా ప్రాముఖ్యతను సంతరించుకుంటాయి. ప్రత్యామ్నాయ ఆర్ధిక వ్యవస్థలు, వాణిజ్య మార్గాల నిర్మాణం, ఆర్ధిక స్థిరత్వం, స్వయం సమృద్ధి కోసం దేశాలు చేస్తున్న ప్రయత్నాలు ఈ ధోరణిని బలపరుస్తున్నాయి.
రష్యా తన మిగులు రూపాయిలను భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో పెట్టుబడిగా పెట్టడం, IMEC వంటి ప్రాజెక్టుల విస్తరణ, గల్ఫ్ SWFs పెట్టుబడులు ఈ పరివర్తనకు దోహదపడుతున్నాయి. ఈ మారుతున్న, విడిపోతున్న అంతర్జాతీయ ఆర్ధిక వ్యవస్థలో పెట్టుబడిదారులు, విధానకర్తలు జాగ్రత్తగా అడుగులు వేయాల్సి ఉంటుంది.