ముడి సరుకుల ధరల భారం నుంచి బయటపడేందుకు ఇండియన్ ఎలక్ట్రానిక్స్ కంపెనీలు కసరత్తు చేస్తున్నాయి. కాపర్ స్థానంలో అల్యూమినియం, స్టీల్ వాడటంతో పాటు లోకల్ మాన్యుఫ్యాక్చరింగ్ పెంచడం ద్వారా ప్రాఫిట్ మార్జిన్స్ని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.
ఎలక్ట్రానిక్స్ రంగంలో ముడి సరుకుల ధరల మంట తారాస్థాయికి చేరింది. గత ఏడాదితో పోలిస్తే కాపర్ ధరలు ఏకంగా 45% పెరగడంతో, తయారీ కంపెనీలు ఇబ్బందుల్లో పడ్డాయి. ఈ పరిస్థితుల్లో మోటార్ వైండింగ్లు, కండెన్సర్ కాయిల్స్ వంటి కీలక భాగాల్లో కాపర్కు బదులుగా అల్యూమినియం, స్టీల్ వాడేందుకు కంపెనీలు మొగ్గు చూపుతున్నాయి. ఈ 'వాల్యూ ఇంజనీరింగ్' వ్యూహం ద్వారా తయారీ ఖర్చులను 2% నుంచి 6% వరకు తగ్గించుకోవాలని చూస్తున్నాయి.
ప్రాఫిట్ మార్జిన్ల మీద ఒత్తిడి
ఎలక్ట్రానిక్స్ కంపెనీల ఆపరేటింగ్ మార్జిన్లు గతంలో డబుల్ డిజిట్ నుండి సింగిల్ డిజిట్కు పడిపోయాయి. ఇప్పటికే 2026 ప్రారంభం నుంచి ధరలు పెంచినప్పటికీ, కస్టమర్ల నుంచి స్పందన తక్కువగా ఉండటంతో కంపెనీలు కొత్త దారులు వెతుకుతున్నాయి. మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) డేటా సెంటర్లు, ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారులు భారీగా కాపర్ సప్లైని ముందుగానే బుక్ చేసుకుంటుండటంతో, చిన్న తయారీదారులకు ముడి సరుకు దొరకడం కష్టంగా మారింది.
లోకల్ తయారీపై ఫోకస్
దిగుమతులపై ఆధారపడటం తగ్గించేందుకు PG Electroplast వంటి కంపెనీలు తమ లోకల్ మాన్యుఫ్యాక్చరింగ్ సామర్థ్యాన్ని పెంచుకుంటున్నాయి. కొత్తగా రొటరీ కంప్రెసర్ ప్లాంట్ను త్వరలో ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాయి. అలాగే LG Electronics India కూడా రెసిన్ల తయారీని స్థానికంగానే చేపట్టేందుకు ప్లాన్ చేస్తోంది.
సవాళ్లు ఏంటి?
ఇన్వెస్టర్లు గమనించాల్సిన ప్రధాన విషయం ఏంటంటే.. ఈ తక్కువ ఖర్చుతో కూడిన డిజైన్లు ఉత్పత్తి నాణ్యతను కాపాడగలవా? కస్టమర్ల నమ్మకాన్ని నిలబెట్టుకోగలవా? అనేది ఇప్పుడు కీలకం. అకాల వర్షాల వల్ల ఇప్పటికే కూలింగ్ ప్రొడక్ట్స్ అమ్మకాలు తగ్గుముఖం పట్టడం, డీలర్లు ఇన్వెంటరీ విషయంలో జాగ్రత్తగా ఉండటం వంటి అంశాలు మార్కెట్పై ప్రభావం చూపుతున్నాయి.
