కేంద్ర బడ్జెట్ 2026-27లో ప్రజారోగ్య రంగంలో పలు కీలక కేటాయింపులు చేశారు. మానసిక ఆరోగ్యం, అత్యవసర సేవల సామర్థ్యాన్ని పెంచే దిశగా ఈ బడ్జెట్ ప్రణాళికలు రచిస్తోంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, మానసిక ఆరోగ్యం, న్యూరో సైన్స్ పరిశోధనల కోసం రెండో అత్యున్నత సంస్థ అయిన NIMHANS-2 ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ప్రత్యేక చికిత్స, పరిశోధనా కేంద్రాల కొరతను తీర్చడమే దీని ముఖ్య ఉద్దేశ్యం. ప్రస్తుతం ఉన్న బెంగళూరు NIMHANS కు ఇది అదనంగా నిలుస్తుంది.
అంతేకాకుండా, రాంచీ, తేజ్పూర్లోని జాతీయ మానసిక ఆరోగ్య సంస్థలను (National Mental Health Institutes) కూడా అప్గ్రేడ్ చేయనున్నారు. ఆర్థిక ఒత్తిళ్లు, అత్యవసర పరిస్థితులు, సామాజిక సవాళ్లను ఎదుర్కొంటున్న బలహీన వర్గాలకు మెరుగైన మద్దతు అందించే విస్తృత ప్రభుత్వ వ్యూహంలో ఇది భాగం.
బడ్జెట్ లో మరో కీలక అంశం - అత్యవసర, ట్రామా కేర్ సేవల విస్తరణ. దేశవ్యాప్తంగా ఉన్న జిల్లా ఆసుపత్రుల్లో ప్రత్యేక ఎమర్జెన్సీ, ట్రామా కేర్ సెంటర్ల ద్వారా ఈ సేవలను 50% మేర పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాలు, హింసాత్మక సంఘటనల వల్ల కుటుంబాలపై, ముఖ్యంగా తక్కువ ఆదాయ వర్గాలపై పడే ఆర్థిక, మానసిక భారాన్ని గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నారు.
గత జనవరి 29, 2026న నిర్వహించిన ఒక సర్వేలో మానసిక ఆరోగ్యం తీవ్రమైన ప్రజారోగ్య సమస్యగా తేలింది. యువతలో సోషల్ మీడియా వ్యసనం, సైబర్ బుల్లీయింగ్ వల్ల ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలు పెరుగుతున్నాయని, అలాగే డిజిటల్ వ్యసనం విద్యా పనితీరు, సామాజిక సంబంధాలపై ప్రభావం చూపుతోందని సర్వేలో వెల్లడైంది. ఈ పరిస్థితులే, మానసిక ఆరోగ్య మౌలిక సదుపాయాలు, సహాయక వ్యవస్థల్లో ప్రభుత్వం పెట్టుబడులు పెట్టాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తున్నాయి.