వడ్డీ రేట్ల యథాతథ స్థితి.. పెరుగుదలకు దారితీసే అంశాలేంటి?
ప్రస్తుతం ద్రవ్యోల్బణం (Inflation) అదుపులోనే ఉన్నా, RBI ముందు పెద్ద సవాలు 'దిగుమతి' అయ్యే ద్రవ్యోల్బణం. అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుతున్న ముడి చమురు ధరలు దీనికి ప్రధాన కారణం. జూన్ మీటింగ్లో రేట్లను యథాతథంగా ఉంచడం ద్వారా, గ్లోబల్ సప్లై షాక్స్ తాత్కాలికమా లేక ధరల పెరుగుదల శాశ్వతమా అని RBI వేచి చూసే అవకాశం ఉంది.
రూపాయి పతనం.. RBIకి కొత్త తలనొప్పి
భారత రూపాయి విలువ నిరంతరం పడిపోవడం RBIకి ఆందోళన కలిగిస్తోంది. వడ్డీ రేట్లను దేశీయ ధరల స్థిరత్వం కోసం నిర్ణయించినా, రూపాయి బలహీనపడటం వల్ల ద్రవ్యోల్బణం మరింత పెరిగే ప్రమాదం ఉంది. ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ వంటి దేశాలు తమ కరెన్సీలను కాపాడుకోవడానికి వడ్డీ రేట్లను పెంచుతుండగా, RBI తీరుపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఫారెక్స్ రిజర్వులను ఉపయోగించి కరెన్సీని కాపాడే ప్రయత్నం ప్రస్తుతానికి తాత్కాలిక ఉపశమనం కలిగించినా, ఇది దీర్ఘకాలంలో ప్రభావవంతం కాకపోవచ్చు.
విశ్వసనీయతపై ప్రభావం.. పెరుగుతున్న ముప్పు
RBI నిష్క్రియంగా ఉండి, పెట్టుబడులు బయటకు వెళ్తుంటే.. మార్కెట్ లో విశ్వసనీయత దెబ్బతినే ప్రమాదం ఉంది. గ్లోబల్ మార్కెట్లలో అనిశ్చితి పరిస్థితుల్లో, దేశ ఆర్థిక వ్యవస్థ కూడా ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉంది. హోల్సేల్ ధరల సూచీ (WPI)లో పెరుగుదల కూడా ఆందోళన కలిగిస్తోంది. ముడి చమురు ధరలు ఇలాగే పెరిగితే, భవిష్యత్తులో వడ్డీ రేట్లను అకస్మాత్తుగా, పెద్ద మొత్తంలో పెంచాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. ఇది బాండ్, ఈక్విటీ మార్కెట్లలో మరింత ఒడిదుడుకులకు దారితీయవచ్చు.
ఏడాదీఖరులో వడ్డీ రేట్ల పెంపు ఖాయం?
ఈ వసంతకాలం ప్రారంభం నుంచి, విశ్లేషకుల అంచనాలు మారుతున్నాయి. రాబోయే 2026 నాలుగో త్రైమాసికం నాటికి వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉందని ఎక్కువ మంది భావిస్తున్నారు. ప్రస్తుతానికి RBI నెమ్మదిగా వ్యవహరించినా, ఇకపై చర్యలు తీసుకోవడానికి సమయం మించిపోతోందని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు వడ్డీ రేట్లను పెంచుతున్న నేపథ్యంలో, RBI కూడా 25 బేసిస్ పాయింట్ల మేర రేట్లను పెంచి, దేశీయ విధానాలను అంతర్జాతీయ ట్రెండ్కు అనుగుణంగా మార్చుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు. దీంతో, పాలసీల్లో వెసులుబాటుకు కాలం చెల్లిందని సూచనలు కనిపిస్తున్నాయి.
