బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వల్ల పంటలకు భారీ ముప్పు పొంచి ఉంది. అక్టోబర్ లో జరగనున్న RBI మానిటరీ పాలసీ మీటింగ్ పై ఈ వాతావరణ మార్పులు తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
భారతదేశంలో రుతుపవనాల తిరోగమనం ఇప్పటికే ప్రారంభమైంది, అయితే సాధారణం కంటే ఇది 2 రోజులు ఆలస్యంగా జరుగుతోంది. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడుతున్న కొత్త అల్పపీడనం వల్ల దక్షిణ, తూర్పు భారత్ లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇది వ్యవసాయ రంగానికి పెద్ద సవాలుగా మారింది. దేశవ్యాప్తంగా ఇప్పటికే 15%, దక్షిణ ద్వీపకల్పంలో 28% వర్షపాతం లోటు ఉంది.
రైతులకు కత్తి మీద సాము
ఈ చిరుజల్లులు సోయాబీన్, పప్పుధాన్యాలు, పత్తి పంటలకు కొంత మేర మేలు చేసినప్పటికీ, తుఫాను హెచ్చరికలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. పంటలు చేతికి వచ్చే సమయంలో భారీ వర్షాలు కురిస్తే పొలాలు నీట మునిగి, పంట నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. దీనివల్ల సరఫరా గొలుసు (Supply Chain) దెబ్బతిని, నిత్యావసర ధరలు పెరిగే అవకాశం ఉంది.
RBI ముందున్న సవాలు
అక్టోబర్ 5 నుండి 7 వరకు జరగనున్న మానిటరీ పాలసీ కమిటీ (MPC) సమావేశంపై ఈ వాతావరణ పరిస్థితులు ప్రభావం చూపనున్నాయి. సెప్టెంబర్ నెల ద్రవ్యోల్బణం డేటా అక్టోబర్ 12న విడుదల కానుంది. అంటే ద్రవ్యోల్బణ గణాంకాలు చేతిలో లేని సమయంలోనే RBI రేట్లపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి, ఇప్పుడు రిజర్వాయర్ల స్థాయిలు, పంటల స్థితిగతులపైనే RBI దృష్టి సారించాల్సి ఉంది. ఫుడ్ ఇన్ఫ్లేషన్ పెరిగితే వడ్డీ రేట్ల తగ్గింపుపై RBI వెనకడుగు వేయవచ్చని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
