భారీ అప్పులకు రాష్ట్రాలు సిద్ధం!
ఈ ఆర్థిక సంవత్సరం (FY27) కోసం భారత రాష్ట్రాలు తమ అప్పులను గణనీయంగా పెంచుకుంటున్నాయి. ICRA అంచనాల ప్రకారం, స్థూల (Gross) అప్పులు ₹13.4 లక్షల కోట్ల నుంచి ₹14 లక్షల కోట్ల వరకు చేరొచ్చు. ఇది FY26లోని ₹12.8 లక్షల కోట్ల కంటే 5-9% అధికం. అన్ని అప్పులు చెల్లింపులు (debt payoffs) పోగా, స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ (SGS) ద్వారా నికర (Net) అప్పు సుమారు ₹9.2-9.7 లక్షల కోట్ల మధ్య ఉండొచ్చని, ఇది గత ఏడాది కంటే 1-8% పెరుగుదల అని తెలుస్తోంది.
RBI కొత్త రుణ వ్యూహం (Debt Strategy)
ఇక భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) రాష్ట్రాల అప్పుల ప్రక్రియను మరింత పారదర్శకంగా, ఊహించగలిగేలా చేసేందుకు 'బెంజ్మార్క్ ఇష్యూయెన్స్ స్ట్రాటజీ' (Benchmark Issuance Strategy) అనే పైలట్ ప్రాజెక్ట్ను ప్రారంభించింది. దీని లక్ష్యం రాష్ట్ర ప్రభుత్వ రుణాలను మరింత ఊహించదగినదిగా (predictable) మార్చడం. ఈ వ్యూహంలో భాగంగా, తొమ్మిది రాష్ట్రాలు నిర్దేశిత మెచ్యూరిటీ టర్మ్స్తో ₹1.5 లక్షల కోట్ల విలువైన సెక్యూరిటీలను జారీ చేస్తాయి. ఇది SGS మార్కెట్లో ట్రేడింగ్ను, స్పష్టతను పెంచే లక్ష్యంతో చేపడుతున్నారు.
మొదటి క్వార్టర్ (Q1) FY27 కోసం, RBI స్థూల SGS జారీని ₹2.5 లక్షల కోట్లకు పెంచాలని యోచిస్తోంది. ఇది గత ఏడాది కంటే 26.7% అధికం. ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే మార్కెట్ కార్యకలాపాలను నియంత్రించడంపై RBI దృష్టి సారించినట్లు ఇది సూచిస్తోంది.
రాష్ట్రాల సమాచార లోపాలు ఈ వ్యూహానికి అడ్డంకి!
అయితే, ఈ కొత్త వ్యూహం విజయవంతం కావడానికి రాష్ట్రాల నుంచి సహకారం కీలకమని ICRA తన రిపోర్ట్లో పేర్కొంది. అసలు సమస్య ఏమిటంటే, రాష్ట్రాలు తమ ప్రణాళిక ప్రకారం, నిర్ణీత మెచ్యూరిటీ టర్మ్స్లో అప్పులు చేయడంలో గతంలోనే విఫలమయ్యాయి. ముఖ్యంగా మొదటి క్వార్టర్లో ప్రణాళికకు, వాస్తవ జారీకి మధ్య భారీ తేడాలు కనిపించాయి.
ఈ అంతరాలను తగ్గించాలంటే, రాష్ట్రాలు తమ అప్పుల పరిమితుల ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వానికి వేగంగా దరఖాస్తులు సమర్పించాలని ICRA సూచిస్తోంది. కేంద్రం ఈ పరిమితులను త్వరగా సమీక్షించి, ఆమోదించి, తెలియజేస్తే అప్పుల ప్రక్రియ సరళతరం అవుతుందని, మార్కెట్కు కూడా ఊహించగలిగేలా ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.