భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన Digital India Land Records Modernisation Programme (DILRMP 3.0) మూడో దశను ప్రారంభించింది. ఇందుకోసం **₹565.5 కోట్ల** బడ్జెట్ను కేటాయించింది.
గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా భూ నిర్వహణ వ్యవస్థను ఆధునీకరించేందుకు 2031 వరకు ₹565.5 కోట్ల భారీ పెట్టుబడితో DILRMP 3.0ని చేపట్టింది. ఇది కేవలం రికార్డులను ఆన్లైన్ చేయడం మాత్రమే కాదు, మాన్యువల్ పద్ధతుల నుంచి జియో-స్పేషియల్ (GIS) ఆధారిత డిజిటల్ ఫ్రేమ్వర్క్కు మారే కీలక అడుగు.
'నేషనల్ ల్యాండ్ స్టాక్'తో కొత్త శకం
ఈ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన అంశం 'నేషనల్ ల్యాండ్ స్టాక్'. ప్రతి భూమికి 14-అంకెల Bhu-Aadhaar లేదా Unique Land Parcel Identification Number (ULPIN) కేటాయించనున్నారు. ఇది భూమి హద్దులు, యాజమాన్య హక్కుల విషయంలో ఉండే గందరగోళాన్ని తొలగిస్తుంది. అలాగే, దేశవ్యాప్తంగా రద్దీగా ఉండే 75 సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలను పాస్పోర్ట్ సేవా కేంద్రాల తరహాలో 'రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు'గా ఆధునీకరించనున్నారు.
రియల్ ఎస్టేట్, బ్యాంకింగ్కు మేలు
ఈ డిజిటలైజేషన్ వల్ల రియల్ ఎస్టేట్ డెవలపర్లకు, బ్యాంకింగ్ రంగానికి ఊరట లభిస్తుంది. భూమి టైటిల్స్ క్లియర్ కావడంతో ప్రాజెక్టులు వేగంగా పూర్తవుతాయి. ముఖ్యంగా బ్యాంకులు ఆస్తులపై రుణాలు ఇచ్చేటప్పుడు టైటిల్ వెరిఫికేషన్ ప్రక్రియ సులభతరం అవుతుంది, తద్వారా రైతులకు, ఆస్తి యజమానులకు సులభంగా రుణాలు అందుతాయి.
సవాళ్లు ఏంటి?
భూమి అనేది రాష్ట్రాల పరిధిలోని అంశం (State Subject) కావడంతో, కేంద్రం నిర్దేశించిన ప్రమాణాలను అన్ని రాష్ట్రాలు అమలు చేయాల్సి ఉంటుంది. పాత రెవెన్యూ కోర్టు రికార్డులను, చేతిరాతతో ఉన్న డాక్యుమెంట్లను డిజిటలైజ్ చేయడం ఒక పెద్ద సవాలుగా మారనుంది. రాష్ట్రాల భాగస్వామ్యం, సమన్వయంపైనే ఈ ప్రాజెక్టు సక్సెస్ ఆధారపడి ఉంటుంది.
