IMEI నంబర్లను మార్చడం లేదా SIM కార్డ్లను దుర్వినియోగం చేయడం ఇకపై నేరం. టెలికాం యాక్ట్ 2023 ప్రకారం, నిబంధనలు అతిక్రమిస్తే ₹50 లక్షల జరిమానా మరియు 3 ఏళ్ల జైలు శిక్ష తప్పదు.
సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా టెలికాం శాఖ (DoT) సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై ఎవరైనా మొబైల్ IMEI నంబర్లను ట్యాంపరింగ్ చేసినా, లేదా ఫ్రాడ్ సిమ్ కార్డులను వాడినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే. కొత్తగా అమల్లోకి వచ్చిన టెలికాం యాక్ట్ 2023 ప్రకారం, ఇటువంటి పనులకు పాల్పడితే ₹50 లక్షల వరకు జరిమానా మరియు 3 ఏళ్ల జైలు శిక్ష విధించనున్నారు.
నాన్-బెయిలబుల్ నేరం
ఈ నిబంధనలను ప్రభుత్వం అత్యంత కఠినంగా అమలు చేస్తోంది. IMEI మార్చడం, ఫేక్ సిమ్ కార్డ్స్ వాడటం, లేదా వేరొకరి పేరిట సిమ్ కార్డులు తీసుకోవడం వంటివి ఇకపై 'కాగ్నిజబుల్' మరియు 'నాన్-బెయిలబుల్' నేరాల కిందకు వస్తాయి. అంటే పోలీసులు వారెంట్ లేకుండానే అరెస్టు చేయవచ్చు, అలాగే బెయిల్ పొందడం కూడా చాలా కష్టతరం అవుతుంది.
సిమ్ 'మ్యూలింగ్' పై హెచ్చరిక
కేవలం హార్డ్వేర్ మార్పులే కాదు, 'సిమ్ మ్యూలింగ్' (SIM muling) అనే కొత్త సమస్యపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. చాలామంది తమ సిమ్ కార్డులను ఇతరులకు అద్దెకు ఇవ్వడం లేదా అమ్మేయడం చేస్తుంటారు. ఆ సిమ్ కార్డులను ఉపయోగించి వేరే వారు సైబర్ నేరాలు చేస్తే, ఆ సిమ్ యజమానిదే పూర్తి బాధ్యత అని ప్రభుత్వం స్పష్టం చేసింది.
Sanchar Saathi ప్రాముఖ్యత
టెలికాం నెట్వర్క్ల భద్రతను పెంచేందుకు, మొబైల్ కంపెనీలు మరియు టెలికాం ఆపరేటర్లపై కూడా నిఘా పెరిగింది. అన్ని మొబైల్ హార్డ్వేర్ రికార్డులను ప్రభుత్వానికి చెందిన 'Sanchar Saathi' పోర్టల్తో అనుసంధానం చేయాల్సిన అవసరం ఉంది. యూజర్లు కూడా తమ ఫోన్ల ప్రామాణికతను చెక్ చేసుకోవడానికి ఈ పోర్టల్ ను వాడాలని సూచిస్తున్నారు. సైబర్ మోసాల కట్టడికి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం డిజిటల్ వ్యవస్థలో కీలక మార్పులకు దారితీయనుంది.
