గ్లోబల్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ లో వంట నూనెల ఆధిపత్యం
FAO ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ ఏప్రిల్ 2026 లో 130.7 పాయింట్లకు చేరింది. మార్చి తో పోలిస్తే ఇది 1.6% ఎక్కువ కాగా, గతేడాది ఏప్రిల్ తో పోలిస్తే 2.0% పెరుగుదల నమోదైంది. అయితే, ఇది మార్చి 2022 గరిష్ట స్థాయి కంటే 18.4% తక్కువగానే ఉంది.
ఇందులో ముఖ్యంగా, వంట నూనెల ధరలు అనూహ్యంగా 5.9% పెరిగి, జూన్ 2022 తర్వాత అత్యధిక స్థాయికి చేరుకున్నాయి. పెరుగుతున్న క్రూడ్ ఆయిల్ ధరల నేపథ్యంలో, బయోఫ్యూయల్ రంగం నుంచి వచ్చిన బలమైన డిమాండ్.. పామాయిల్, సోయా, పొద్దుతిరుగుడు, రేప్సీడ్ వంటి నూనెల ధరలను దూసుకుపోయేలా చేసింది.
మాంసం ధరలు కూడా ఏప్రిల్ లో మార్చి తో పోలిస్తే 1.2%, గతేడాది తో పోలిస్తే 6.4% పెరిగి, రికార్డు స్థాయికి చేరాయి. అమెరికాలో కరువు పరిస్థితులు, ఆస్ట్రేలియాలో ఎరువుల ధరలు పెరగడం వల్ల సాగు తగ్గుతుందనే అంచనాల నేపథ్యంలో, ధాన్యాల ధరలు 0.8% స్వల్పంగా పెరిగాయి. ఫర్టిలైజర్, గ్లోబల్ షిప్పింగ్ ఖర్చులు పెరగడం, కీలక వాణిజ్య మార్గం అయిన స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ మూసివేత వంటి పరిణామాలు సరఫరా గొలుసులపై (Supply Chains) తీవ్ర ప్రభావం చూపాయి.
దీనికి విరుద్ధంగా, పాల ఉత్పత్తుల ధరలు మార్చి తో పోలిస్తే 1.1% తగ్గాయి. భారీ ఉత్పత్తి నెలకొనడంతో, ఏడాది కాలంలో ఇవి 21.2% పడిపోయాయి. అలాగే, బ్రెజిల్, థాయ్లాండ్ వంటి దేశాల్లో మంచి దిగుబడి అంచనాలు, సరఫరా ఎక్కువగా ఉండటంతో చక్కెర ధరలు నెలవారీగా 4.7%, వార్షికంగా 21.2% తగ్గాయి.
భారతదేశంలో వంట నూనె, టొమాటోలదే పైచేయి
భారతదేశంలో స్థానిక ఆహార ధరలు మిశ్రమంగా ఉన్నాయి. దేశీయ సరఫరాను పెంచడానికి వాణిజ్యపరమైన ఆంక్షలు విధించడం వల్ల, అంతర్జాతీయ మార్కెట్ ఒడిదుడుకుల నుంచి కొంతవరకు దేశీయ మార్కెట్ తప్పించుకుంది. అయితే, దిగుమతి అయ్యే వంట నూనెలు మాత్రం ఇందుకు మినహాయింపు. గత మూడు నెలల్లో సామాన్యులు ఎక్కువగా వాడే నూనెల రిటైల్ ధరలు 6-7% పెరిగాయి. ఇది గ్లోబల్ ట్రెండ్స్ నే ప్రతిబింబిస్తోంది.
ఏప్రిల్ 2026 లో భారతదేశ రిటైల్ ద్రవ్యోల్బణం (CPI) నాలుగు నెలల గరిష్ట స్థాయి అయిన 3.48% కి చేరుకుంది. ఆహార ద్రవ్యోల్బణం కూడా 4.20% కి పెరిగింది. దీనికి ప్రధానంగా దేశీయ అంశాలే కారణం. ముఖ్యంగా, టొమాటో ధరలు ఏప్రిల్ లో ఏడాది కాలంతో పోలిస్తే 35.28% భారీగా పెరిగాయి. బియ్యం, గోధుమ వంటి నిత్యావసరాల ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, వినియోగదారులు స్థానిక ధరల పెరుగుదలను ఎదుర్కొంటున్నారు. దీనికి విరుద్ధంగా, ఉల్లి, బంగాళదుంప ధరలు గణనీయంగా తగ్గాయి.
ఫ్రైట్ కాస్ట్స్ రిస్క్.. ఆందోళనలో సామాన్యుడి జేబు
భారతదేశ ఆహార బడ్జెట్కు అతిపెద్ద ముప్పు, అంతర్జాతీయ వాణిజ్య వస్తువుల ధరల పెరుగుదల కంటే, గ్లోబల్ ఎనర్జీ ధరల వల్ల దేశీయ ఫ్రైట్ కాస్ట్స్ (రవాణా ఖర్చులు) పెరగడమే.
మే 2026 లో భారతదేశ ముడి చమురు బాస్కెట్ సుమారు $105 బ్యారెల్ గా ఉంది. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు ఎక్కువగా ఉన్నప్పటికీ, మే 12, 2026 నాటికి ప్రభుత్వం ఇంధన ధరలను వినియోగదారులపైకి బదలాయించలేదు.
ఒకవేళ, ఇంధన ధరలను అంతర్జాతీయ స్థాయికి అనుగుణంగా గణనీయంగా పెంచితే, రవాణా ఖర్చులు పెరిగి, ఆహార ఉత్పత్తుల ధరలు విస్తృతంగా పెరుగుతాయి. ఇది ఇన్వెస్టర్లు, వినియోగదారులకు ప్రధాన రిస్క్ గా మారనుంది.
దీర్ఘకాలంలో, భౌగోళిక రాజకీయ అనిశ్చితి, తీవ్రమైన వాతావరణ మార్పులు, కార్మికుల కొరత వంటివి ఉత్పత్తి సామర్థ్యాన్ని పరిమితం చేసి, లాజిస్టిక్స్ ను దెబ్బతీస్తాయి. సాధారణం కంటే తక్కువ వర్షపాతం అంచనాలు.. ఖరీఫ్ పంట ఉత్పత్తిపై ప్రభావం చూపి, మరింత అనిశ్చితిని పెంచుతాయి. ప్రస్తుతానికి ప్రపంచ ఆహార సరఫరాలు బలంగా ఉన్నప్పటికీ, కీలక షిప్పింగ్ మార్గాల మూసివేత, రైతులు ఎరువుల ధరలు పెరగడం వల్ల సాగు తగ్గించుకునే అవకాశం ఉంటే.. భవిష్యత్తులో దిగుబడులు తగ్గి, ప్రపంచవ్యాప్తంగా, దేశీయంగా ధరల ఒత్తిడి మరింత పెరిగే అవకాశం ఉంది. చౌక రవాణా కాలం ముగిసిపోయిందని, ఇంధన ధరల అస్థిరత రవాణా ఖర్చులను అధికంగానే ఉంచుతుందని అంచనా వేస్తున్నారు.
