ఎస్బీఐ పిటిషన్ - తీర్పులో లోపాలున్నాయే?
ఫిబ్రవరి 13న వెలువడిన సుప్రీంకోర్టు తీర్పులో కొన్ని స్పష్టమైన తప్పులున్నాయని, స్పెక్ట్రమ్ వినియోగ హక్కులు (Spectrum Usage Rights), వాటిని కొలేటరల్ (Collateral) గా ఎలా ఉపయోగించాలనే దానిపై కీలక చట్టపరమైన ప్రశ్నలకు సమాధానాలు లేవని ఎస్బీఐ తన పిటిషన్ లో వాదించింది. స్పెక్ట్రమ్ ను కేవలం ప్రభుత్వం నియంత్రించే వనరుగా మాత్రమే కోర్టు పరిమితంగా చూసిందని, బ్యాంకింగ్ కార్యకలాపాలను విస్మరించిందని బ్యాంకు అభిప్రాయపడింది. రుణదాతలకు స్పెక్ట్రమ్ వినియోగ హక్కులపై చట్టపరమైన హక్కు ఉందా, ఇన్సాల్వెన్సీ సమయంలో అప్పులను రికవర్ చేయడానికి వీటిని అమ్మే అవకాశం ఉందా అనేదే ఇక్కడ ప్రధాన వివాదాంశం.
రుణాల రికవరీపై తీవ్ర ప్రభావం!
ఈ వివాదం 2018లో ఎయిర్సెల్ (Aircel) కంపెనీ దివాలా (Insolvency) తీయడంతో మొదలైంది. అప్పుడు ఎస్బీఐ నేతృత్వంలోని రుణదాతలకు ఎయిర్సెల్ సుమారు ₹13,000 కోట్లకు పైగా బకాయిపడింది. ఇక్కడ అసలు సమస్య ఏంటంటే.. స్పెక్ట్రమ్ వినియోగ హక్కులను ఆస్తులుగా పరిగణించి రికవర్ చేయాలనుకుంటున్న రుణదాతలకు, బకాయిలు చెల్లించాలని కోరుతున్న టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ (Department of Telecommunications) కు మధ్య జరుగుతున్న ఘర్షణ. స్పెక్ట్రమ్ అనేది ప్రభుత్వ వనరు కాబట్టి, దానిని ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్ట్సీ కోడ్ (IBC) కింద డెట్ రీస్ట్రక్చరింగ్ (Debt Restructuring) లో భాగంగా పరిగణించరాదని సుప్రీంకోర్టు గతంలో తీర్పు చెప్పింది.
ఇతర రంగాలపై కూడా ప్రభావం!
ఈ తీర్పు ఇలాగే కొనసాగితే, కేవలం టెలికాం రంగంలోనే కాకుండా.. మైనింగ్ (Mining), పవర్ (Power), ఇన్ఫ్రాస్ట్రక్చర్ (Infrastructure) వంటి ఇతర నియంత్రిత రంగాలపైనా (Regulated Industries) తీవ్ర ప్రభావం చూపుతుందని బ్యాంకులు హెచ్చరిస్తున్నాయి. ఎందుకంటే ఈ రంగాలలోని కంపెనీలు కూడా ప్రభుత్వాలు జారీ చేసే లైసెన్సులపైనే ఆధారపడి వ్యాపారాలు నడుపుతాయి. ఎస్బీఐ పిటిషన్ ప్రకారం, ఈ తీర్పు బ్యాంకులు క్రెడిట్ రిస్క్ (Credit Risk) ను అంచనా వేసే విధానాన్ని పూర్తిగా మార్చేయాల్సి వస్తుందని, దీనివల్ల ఇలాంటి హక్కులపై ఆధారపడే ప్రాజెక్టులకు నిధులు (Funding) సమకూర్చడానికి బ్యాంకులు విముఖత చూపవచ్చు. ఇది భవిష్యత్ లో వృద్ధి (Growth) , పెట్టుబడులను (Investment) మందగింపజేసే అవకాశం ఉంది.
