పంటపై వాతావరణం ప్రభావం
వ్యాపార వర్గాల అంచనాల ప్రకారం, గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది గోధుమ ఉత్పత్తి 5% నుండి 10% వరకు తగ్గుతుందని తెలుస్తోంది. ఇది ప్రభుత్వ అంచనాలకు పూర్తి విరుద్ధం. పంట చేతికొచ్చే చివరి వారాల్లో కురిసిన అకాల వర్షాలు, వడగళ్ల వానలు ముఖ్యంగా మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్ వంటి ప్రధాన గోధుమ ఉత్పత్తి రాష్ట్రాల్లో పంట దిగుబడిని దారుణంగా దెబ్బతీశాయి.
ప్రభుత్వ నిల్వలే భరోసా
Olam Agri India డెప్యూటీ కంట్రీ హెడ్ నితిన్ గుప్తా మాట్లాడుతూ, మొదట్లో పంట బాగానే ఉన్నా, కోతకు ముందు వాతావరణం దిగుబడిని తగ్గించిందని తెలిపారు. అయితే, గత నాలుగేళ్లుగా చూస్తున్నట్లుగానే, ఈసారి కూడా ప్రభుత్వ ఏజెన్సీల కొనుగోళ్లు తగ్గినా, దేశీయంగా కొరత ఏర్పడే అవకాశం లేదని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం వద్ద గోధుమ నిల్వలు అవసరమైన స్థాయికి 3 రెట్లు ఎక్కువగా ఉండటంతో, దేశీయ డిమాండ్కు ఎలాంటి ఇబ్బంది ఉండదని స్పష్టం చేశారు.
ఉత్పత్తిపై ఆందోళన.. ఎగుమతులకు ఊపు
ఏప్రిల్ తొలి నాటికి భారత ప్రభుత్వ గోధుమ నిల్వలు 21.8 మిలియన్ టన్నులకు చేరాయి. ఇది గత ఏడాదితో పోలిస్తే 85% అధికం, ఐదేళ్లలో అత్యధికం. ఈ బలమైన నిల్వల నేపథ్యంలోనే, ప్రభుత్వం అదనంగా మరో 2.5 మిలియన్ టన్నుల గోధుమ ఎగుమతులకు అనుమతి ఇచ్చింది. దీంతో మొత్తం ఎగుమతి కోటా 5 మిలియన్ టన్నులకు చేరింది. ప్రభుత్వ ఏజెన్సీలు 30.3 మిలియన్ టన్నుల గోధుమను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నా, తొలి కొనుగోళ్లు నెమ్మదిగా సాగుతున్నాయి. దీంతో నాణ్యతా ప్రమాణాలను కూడా కొద్దిగా సడలించారు. వ్యాపారులు మాత్రం వాస్తవ కొనుగోళ్లు 26 మిలియన్ల నుండి 28 మిలియన్ టన్నుల మధ్య ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
